Thursday 20 February 2020

థాంక్ గాడ్!

పోస్టు పాతదే...

ఇదే బ్లాగ్‌లో కొన్ని నెలలక్రితం రాశాను. సందర్భం వచ్చి, ఇప్పుడు మళ్లీ  రాయాలనిపించింది.

కట్ చేస్తే -  

ఆమధ్య ఒక మాతాజీ ఉవాచ చదివాను.

మన కష్టాలు ఎవరితోనూ చెప్పుకోవద్దట. చెప్పుకున్నా లాభం ఉండదట.

ఒకవేళ చెప్పుకున్నా .. 20% మంది అసలు పట్టించుకోరట. 80% మంది "వీడికి బాగా అయ్యిందిలే" అని ఎంజాయ్ చేస్తారట.

ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోవడం బెటర్.. అంతా ఆయనే చూసుకుంటాడు అని.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నేను బాగా నమ్ముతాను.

అలాగని నేను నాస్తికున్ని కాదు.

ఎదుటివాడిని బాధపెట్టనంతవరకు, అందరి వ్యక్తిగత నమ్మకాలను నేను విధిగా గౌరవిస్తాను.

అదొక క్రమశిక్షణ.

అదొక సంస్కారం.

అంతే.

ఇందాక మాత చెప్పినదాంట్లో .. "ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోండి. అంతా ఆయనే చూసుకుంటాడు" అన్న చివరి వాక్యం గురించి నాకంతగా తెలీదు. కానీ, ఆమె చెప్పిన అసలు పాయింట్‌లో మాత్రం చాలావరకు వాస్తవం ఉందని నేననుకుంటున్నాను.

లెక్కలోనే నాకు తోచిన ఒక చిన్న సవరణ...

మన కష్టాలు విని 80% ఎగతాళి చెయ్యొచ్చు. 19% అసలు కేర్ చెయ్యకపోవచ్చు.

కానీ 1% మాత్రం స్పందిస్తారు. కనీసం వింటారు. సహాయం చెయ్యకపోయినా ఒక నైతికబలాన్నిస్తారు. నీ ఇబ్బంది గురించి తెల్సిన నేనొకర్ని ఉన్నాను. నువ్వేం ఒంటరివి కాదు. పోరాడు. సమస్యను పరిష్కరించుకో. అది నీకు సాధ్యమే అన్న ఒక భరోసాని వారి ఉనికి ద్వారానే తెలియజేస్తారు.

ఇది నిజంగా చాలా పెద్ద సహాయం.

ఈ 1% మాత్రమే మన మిత్రులు, శ్రేయోభిలాషులు.

కంటికి కనిపించే మన నిజమైన దైవాలు.