Sunday 28 April 2019

ఓయూ అనగానే ఒక ఆనందం

ఓయూ .. ఒక మధురస్మృతుల మాలిక. ఒక ఉద్వేగం. ఒక ఆనందం.

ఫ్రేమ్ బై ఫ్రేమ్ .. ఎన్నో జ్ఞాపకాలు చక చకా అలా నా కళ్లముందు కదిలిపోతుంటాయి.

ఫోటో తీసుకున్నప్పుడల్లా ఒక కొత్త అందంతో కనిపించే ఆర్ట్స్ కాలేజి. అందులో నేను చదివిన ఎం ఏ, ఎం ఎల్ ఐ ఎస్సీ. సాధించిన రెండు గోల్డ్ మెడల్స్ ..

పార్ట్ టైమ్‌గా అదే ఆర్ట్స్ కాలేజ్‌లో నేను ఎంతో ఇష్టంగా చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్ కావడం ..

ఎమ్మేలో నా గురువులు నాయని కృష్ణకుమారి, కులశేఖరరావు, గోపాలకృష్ణారావు, ఎస్వీ రామారావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర, గోపి గార్లు ..

టైపిస్ట్ శశికళ, అటెండర్ ఫక్రుద్దిన్ ..

లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో నా గురువులు ఎ ఎ ఎన్ రాజు, వేణుగోపాల్, లక్ష్మణ్ రావు, జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్, సుదర్శన్‌రావు గార్లు ..

రష్యన్ డిప్లొమాలో నా గురువులు మురుంకర్, కల్పన, ప్రమీలాదేవి గార్లు ..

నా క్లాస్‌మేట్స్, నా ఫ్రెండ్స్ ..

రష్యన్ డిప్లొమాలో తెలుగు మాట్లాడని నార్తిండియన్ సిటీ అమ్మాయిలు ..

నేనున్న ఏ హాస్టల్, మంజీరా హాస్టళ్లు ..

ఏ హాస్టల్లో రూమ్ నంబర్ 6, రూమ్ నంబర్ 55 ..

నా ఆత్మీయ మిత్రులు "బిగ్ ఫైవ్", మా యాకూబ్, మా గుడిపాటి, మా కాముడు ..

ఏ హాస్టల్ మెస్, పుల్లయ్య, పొద్దున చపాతీలు, ఆమ్‌లెట్, మధ్యహ్నం భోజనంలో అన్ని కూరలతోపాటు చిన్న ప్లేట్‌లో మటన్ ముక్కలు, సండే స్పెషల్, సంవత్సరానికోసారి 'మెస్ డే' రోజు కోడికి కోడి తినడాలు .. చివర్లో స్వీట్ పాన్‌లు ..

క్యాంపస్‌లో మెయిన్ క్యాంటీన్, ఆర్ట్స్ కాలేజ్‌ వెనుక చెట్లకింది క్యాంటీన్ ..

రాత్రిళ్లు హాస్టల్ వెనకాల బండలమీద నర్సిమ్మ తడికల క్యాంటీన్‌లో ఆమ్‌లెట్ తిని చాయ్‌లు తాగడం, అర్థరాత్రి దాటేదాకా అవే బండలమీద కూర్చొని సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ కవిత్వాలూ, కబుర్లూ, చర్చలూ, కొట్లాటలు, తిట్టుకోడాలు ..

గంటలకొద్దీ కూర్చొని గడిపిన ఆర్ట్స్ కాలేజ్ లాన్స్, మెయిన్ లైబ్రరీ మెట్లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్ చెట్లనీడలు ..

టాగోర్ ఆడిటోరియంలో ఫంక్షన్లు, సినిమాలు ..

ఆడిటోరియం వెళ్లేదారిలో సన్నని గోడపైన సర్కస్ చేస్తూ నడిచిన రాత్రులు ..

క్యాంపస్ గోడ దూకి వెనకే వున్న ఆరాధన థియేటర్లో వారం వారం సినిమాలు, ఈలలు, పెడబొబ్బలు ..

తెరమీద "అచ్చా అచ్చా .. బచ్చా బచ్చా" పాట వస్తున్నప్పుడు రెచ్చిపోయి లేచి ఎగరడాలు ..

టికెట్ దొరకనప్పుడు మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి గొడవపడటాలు .. 

స్టుడెంట్ యూనియన్‌ల మీటింగులు, గొడవలు, తలలు పగిలి రక్తాలు కారే కొట్లాటలు, తపంచాలతో కాల్పులు ..       

ఒరిస్సా, వైజాగ్, అరకు, బెంగుళూరు, మైసూరు, ఊటీ, కొలనుపాక .. విహార యాత్రలు ..

కోర్సులు పూర్తయ్యాక, ఒక్కో మిత్రుని వీడ్కోలు అప్పుడు ఆగని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్వటాలు .. 
ఇంకా ఎన్నో .. ఎన్నెన్నో .. అన్నీ .. ఈరాత్రి గుర్తుకొస్తున్నాయి.

మిత్రులారా నేనిక్కడ. మరి .. మీరెక్కడ? 

Friday 26 April 2019

ఇది బయోపిక్‌ల సీజన్

ఏదో తీయాలని చెప్పి బయోపిక్ తీయడం వేరు. 

ఒక తక్షణ తాత్కాలిక అవసరమో, మార్కెట్‌నో దృష్టిలో పెట్టుకొని బయోపిక్ తీయడం వేరు. 

కోట్లాదిమంది ప్రజల ఆలోచనలను, జీవితాలను అమితంగా ప్రభావితం చేసిన ఒక వ్యక్తి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించడం వేరు.           

ఈమధ్య ఒక్క ఎన్ టి ఆర్ మీదనే ఏకకాలంలో మూడు బయోపిక్‌ సినిమాలు తయారయ్యాయి. 


క్రిష్ దర్శకత్వంలో, ఎన్ టి ఆర్ మీద .. ముందు ఒక్క సినిమాకే ప్లాన్ చేసి, తర్వాత దాన్ని రెండు సినిమాలుగా రూపొందించారు.

భారీ అంచనాలతో అవి విడుదలయ్యాయి. పోయాయి. 


మరోవైపు, దర్శకుడు ఆర్జీవీ "లక్ష్మీస్ NTR" అనే టైటిల్‌తో, అదే ఎన్ టి ఆర్ మీద ఇంకో భారీ బయోపిక్ తీశాడు.

ఆర్జీవీ మార్కు రకరకాల సంచలనాల మధ్య చివరికి ఆ బయోపిక్‌ ఎన్నికలకు ముందు ఎక్కడైతే విడుదలకావాలని టార్గెట్ చేశారో, ఆ ఏపీలో తప్ప అంతటా విడుదలైంది. ఎన్‌టీఆర్ మీద క్రిష్ తీసిన రెండు సినిమాలకంటే ఈ బయోపిక్ మంచి టాక్ తెచ్చుకొంది. మంచి బిజినెస్ కూడా చేసింది.   


సుమారు రెండు నెలలముందు, ఫిబ్రవరి 8వ తేదీనాడు, వైయస్సార్ బయోపిక్ 'యాత్ర' రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకొంది.  

ఇంక హిందీలో అయితే లెక్కలేనన్ని బయోపిక్‌లు వచ్చాయి. ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా హిందీలో ఏదో ఒక బయోపిక్ రూపొందుతూనే ఉంటుంది.  

త్వరలోనే మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మీద కూడా ఒక బయోపిక్ రాబోతోందని ఆమధ్య ఒక న్యూస్ ఐటమ్ చదివాను.

కట్ చేస్తే - 

"టైగర్ కేసీఆర్" పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బయోపిక్ తీస్తున్నట్టు ఎనౌన్స్ చేసి మరో సంచలనానికి తెరతీశాడు ఆర్జీవీ. ఆర్జీవీ ఆంధ్రాలో పుట్టిపెరిగినవాడు, గతంలో ఉద్యమసమయంలో ఇదే కేసీఆర్ మీద రకరకాల ట్వీట్లు పెట్టినవాడు కూడా కావటంతో ఈ బయోపిక్ మీద సహజంగానే మరింత ఫోకస్ ఉంటుంది. 

అతి త్వరలో, దీనికి వైస్ వెర్సా, మరో దర్శకుడి ద్వారా ఇంకో భారీ బయోపిక్‌కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ రాబోతోందని తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ న్యూస్ కూడా రావొచ్చు. 

Sunday 14 April 2019

ఎమ్మెల్సీ సుభాషన్న!

పార్టీలో అందరికీ ఆయన ఆప్తుడు.

కల్మషంలేని నిర్మల హృదయుడు.

గ్రౌండ్ టూ ఎర్త్ సింప్లిసిటీ.

టీఆరెస్ ఆవిర్భావం నుంచి, కేసీఆర్ వెంట ఆయనకు అతిదగ్గరగా ఉన్న అతి కొద్దిమంది ప్రధానవ్యక్తుల్లో ఆయన ఒకరు.

ఆయనే శేరి సుభాష్ రెడ్డి.

ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ సెక్రెటరీ.

కట్ టూ సుభాషన్న -

కార్యకర్తలనుంచి అత్యున్నతస్థాయి పార్టీనాయకులదాకా, చాలామంది "సుభాషన్నా" అని ప్రేమగా పలకరించే సుభాష్ రెడ్డి కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. వారి తండ్రి అంతకుముందు సమితి ప్రసిడెంట్‌గా పనిచేశారు.

మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు.

పొలిటికల్ సెక్రెటరీగా తన దగ్గర అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఆయనను TSMDC చైర్మన్‌ను కూడా చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ స్టేట్  మినరల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్ (TSMDC) చైర్మన్‌గా, ఆ పదవిలో కూడా విజయవంతంగా పనిచేస్తూ కార్పొరేషన్ రికార్డులు తిరగరాశారు సుభాష్ రెడ్డి.

ఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం వెనుక వివిధ స్థాయిల్లో టీఆరెస్ కార్యకర్తలు, అభిమానుల సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, కేసీఆర్ బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కోసం చేస్తున్న వేస్తున్న ప్రతి అడుగుకీ, చేస్తున్న ప్రతి పనికీ సంపూర్ణ మద్దతుగా, ఉద్యమం నాటి దూకుడే ఇప్పుడు కూడా మన TRS సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయం.

మొన్ననే పూర్తయిన తెలగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మన సోషల్‌మీడియా సైన్యం దూకుడు ఇంక చెప్పాల్సిన పనిలేదు. విశ్వరూపం చూపించారు.

దీన్నంతటినీ ఎప్పటికప్పుడు ఒక కంట గమనిస్తూ, అవసరమైన చోట సలహాలనిస్తూ దిశానిర్దేశం చేసే మొదటి వ్యక్తీ, ఏకైక వ్యక్తీ సుభాష్ రెడ్డి.

ఇదంత చిన్నవిషయం కాదని నా ఉద్దేశ్యం.

ఆమధ్య అమెరికాలో జరిగిన "ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్‌పో"లో TSMDC చైర్మన్ హోదాలో మన రాష్ట్రం తరపున పాల్గొనివచ్చారు సుభాష్ రెడ్డి.

అంతర్జాతీయంగా భూగర్భవనరుల వెలికితీతలో అనుసరిస్తున్న విధానాలు, వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఈ ఎక్స్‌పో ద్వారా బాగా అధ్యయనం చేసిన సుభాష్ రెడ్డి, మన తెలంగాణ మైనింగ్ రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను జోడించి, చరిత్ర తిరగరాసే అత్యధిక ఆదాయం మన ప్రభుత్వానికి సమకూరేలా చేయాలన్న గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన విజయవంతమైన సేవలను గుర్తించి, ఇటీవలే సుభాష్ రెడ్డికి ఎమ్మెల్లే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చారు కేసీఆర్. 

కట్ టూ సుభాషన్న ఏకైక లక్ష్యం - 

కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో - అనుక్షణం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తిగా సుభాష్ రెడ్డికి కూడా పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి.

సుమారు 14 సంవత్సరాల ఉద్యమంలో తన వ్యక్తిగత జీవితాన్ని దాదాపు త్యాగం చేసిన సుభాష్ రెడ్డి, సి ఎం కు పొలిటికల్ సెక్రెటరీగా ఉన్నా, TSMDC చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా .. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన లక్ష్యం ఒక్కటే:

"బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడవడం, కేసీఆర్ ఆలోచనలను కార్యకర్తలవద్దకు, ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఉద్యమ సమయంలో ఎంతటి దీక్షతో అయితే కేసీఆర్ వెంట పనిచేయడం జరిగిందో, అంతే దీక్షతో కేసీఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ కోసం కూడా పనిచేయడం."

దటీజ్ సుభాషన్న!

ఎమ్మెల్సీగా ఎన్నికయినతర్వాత .. రేపు ఏప్రిల్ 15, సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీ హాల్లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా - శేరి సుభాషన్న గారికివే నా హార్దిక శుభాకాంక్షలు.  

Friday 12 April 2019

ఫిలాసఫీ "30/30/40"

అమెరికన్ బీచ్ వాలీబాల్ స్టార్, ఫ్యాషన్ మోడల్, నటి, స్పోర్ట్స్ ఎనౌన్సర్, టీవీ హోస్ట్, ప్రేయసి, తల్లి, భార్య, (క్రమం అదే!) అథ్లెట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, బెస్ట్ సెల్లర్ రైటర్, మొత్తంగా ప్రపంచం మెచ్చిన ఒక సెలబ్రిటీ ..

ఇవన్నీ కలిస్తే ఒక గాబ్రియెలె రీస్!

ఫ్లారిడా స్టేట్‌కు వాలీబాల్ ఆడుతున్నప్పుడే రీస్ లుక్స్‌కి పడిపోయి ఫాషన్ మోడలింగ్ ఆమెని ఆహ్వానించింది. తర్వాత, "సెరెండిపిటీ" వంటి చిత్రాల్లో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్ అనౌన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా  ESPN, NBT, MTV Sports, Fit TV/Discovery వంటి పాప్యులర్ చానెల్స్‌లో వద్దంటే అవకాశాలు.

తర్వాత.. తనకు నచ్చిన స్నేహితునితో సహజీవనం చేసింది. ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. ఆ తర్వాతే తన సహజీవన నేస్తాన్ని పెళ్లి చేసుకొని భార్య అయింది. తర్వాత అథ్లెట్ అయింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయింది. మధ్యలో గోల్ఫ్‌ని కూడా వదల్లేదు. రెండు పుస్తకాలు రాసి బెస్ట్ సెల్లర్ రైటర్ కూడా అయింది రీస్.

ఇవి చాలవూ.. రీస్ ప్రపంచస్థాయి సెలెబ్రిటీగా పాప్యులర్ కావడానికి?

ఇవి చాలవూ.. నైక్ లాంటి సంస్థ రీస్‌ని తన "గాళ్ పవర్" కేంపెయిన్‌కు "ఐకాన్"గా కాంట్రాక్టుమీద సంతకం పెట్టించుకొని మిలియన్ల డాలర్లివ్వడానికి?

దటీజ్ గాబ్రియెలె రీస్ ..

తను ఎన్నుకున్న ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధించింది. తన మనస్సాక్షినే నమ్మింది. తను అనుకున్నది చేసుకుంటూపోయింది. తను కోరుకున్న జీవనశైలినే ఎంజాయ్ చేస్తూ హాయిగా సంతృప్తిగా జీవిస్తోంది రీస్.

మనకు తెలిసి, మనకున్న ఈ ఒక్క జీవితానికి అంతకన్నా ఏం కావాలి?

కట్ టూ రీస్ ఇంటర్వ్యూ -

ఈ మధ్యే రీస్ గురించి ఒక పాప్యులర్ అమెరికన్ యోగా గురు చెప్తే విన్నాను. తర్వాత ఆమే (యోగా గురు) పంపిస్తే రీస్ ఇంటర్వ్యూ ఒకటి విన్నాను.

ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది:

"మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో..  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు!"

రీస్ విజయాలు, విజయాల పరంపర వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదన్నమాట!

సమాజంతో ముడిపడ్డ, సమాజంపట్ల మన "మైండ్‌సెట్"తో ముడిపడ్ద ఒక గొప్ప జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది రీస్.

ఈ సత్యం - ప్రపంచంపట్ల, నా చుట్టూ ఉన్న మనుషులపట్ల నా దృక్పథాన్నే సంపూర్ణంగా మార్చివేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను.

కానీ నిజం.

మనకు సంతోషాన్నివ్వని వ్యక్తులను గానీ, వాతావరణాన్ని గానీ ఎంత తొందరగా వదిలించుకొంటే అంత మంచిది.

జస్ట్ బ్లాక్ దెమ్!

అంతకు మించిన పనులు, ప్రపంచం మనకు చాలా ఉంది.  

Wednesday 10 April 2019

వొక మానసిక వైకల్యం

కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. సైకియాట్రీలో దానికి తప్పక ఏదో ఒక శాస్త్రీయనామం ఉండే ఉంటుందని నా నమ్మకం.

అసలిలాంటి అంశంపైన ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, రాయడం అవసరం అనిపించి రాస్తున్నాను.

కట్ టూ పాయింట్ - 

బ్లాగ్ అనేది ఆ బ్లాగర్ వ్యక్తిగత ఆలోచనలకు మిర్రర్.

బ్లాగర్ రాసే అంశం ఏదైనా కావొచ్చు, ఖచ్చితంగా అది ఆ బ్లాగర్ వ్యక్తిగత దృక్పథాన్ని, ఆలోచనాధోరణిని తెలుపుతుంది.

అది పర్సనల్ కావొచ్చు. పబ్లిక్ లైఫ్‌కు సంబంధించినది కావొచ్చు. ఒకసారి ఆ అంశం పబ్లిక్‌లోకి వచ్చిందంటే దానిమీద కామెంట్ చేసే స్వేఛ్ఛ ప్రతి బ్లాగ్ రీడర్‌కు ఉంటుంది.

ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఉంటుందని నేననుకోను.

అయితే, కామెంట్ అనేది ఆ నిర్దిష్టమైన బ్లాగ్ పోస్ట్‌లో చర్చించిన అంశంపైనే సూటిగా ఉండాలి. నిర్మాణాత్మకంగా, డిగ్నిఫైడ్‌గా ఉండాలి.

అంతే తప్ప, బ్లాగ్‌లో రాసిన అంశాన్ని పక్కనపెట్టి, దాని మీద చర్చించే సామర్థ్యం/జ్ఞానం లేక, ఏదో ఒక అర్థంలేని చెత్త కామెంట్ పెట్టడం ఆయా వ్యక్తుల మానసిక వైకల్యాన్నే తెలుపుతుంది.

బ్లాగ్‌లో రాసిన విషయం అబధ్ధం .. అసలు నిజం ఇది అని చెప్పగలగాలి. విశ్లేషణ చేయగలగాలి. ఏదైనా డేటా ఉంటే ఇవ్వగలగాలి. అలా, బ్లాగ్‌లో రాసిన టాపిక్‌పైన ఎంతైనా చీల్చి చెండాడవచ్చు. ఆ హక్కు కామెంటర్‌కు ఉంటుంది.

కాని, అది నిర్మాణాత్మకంగా ఉండాలి. 

అంతే తప్ప, టాపిక్‌ను పక్కనపెట్టి వ్యక్తిగతంగా ఏదో అసంబధ్ధమైన కామెంట్ చేయడం, లేదా ఏదో ఒక సంబంధం లేని  విషయాన్ని కామెంట్‌గా పెట్టడం అనేది సరైన పధ్ధతి కాదు. 

ఇలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు.

నా ఇన్నేళ్ల బ్లాగింగ్ లైఫ్‌లో ఇలాంటివాళ్లు కూడా కొందరు నాకు ఎదురయ్యారు.

నేను చాలా ఓపికగా వీరి కామెంట్స్‌కు కూడా జావాబిస్తాను. కాని, ఒక పరిధి దాటిన తర్వాత ఏం చేయలేం.

అదొక మానసిక వైకల్యం అనుకొని వారినలా వదిలివేయటం, బ్లాక్ చేయటం తప్ప. 

Monday 8 April 2019

కౌంట్ డౌన్ .. 18 గంటలు!

ప్రచారపర్వం ముగియడానికి ఇంకా కేవలం 18 గంటలు మాత్రమే ఉన్నది.

ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. 

ఈ క్షణం నుంచి ప్రతి క్షణం విలువైనదే.

ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కాగా, ఇప్పటినుంచి 11 వ తేదీనాడు పోలింగ్ ముగిసేదాకా చేసే కసరత్తు, పడే శ్రమ, తీసుకొనే జాగ్రత్తలు ఒక ఎత్తు.

టఫ్ ఫైట్ ఉండే అవకాశముందనుకునే కొన్ని స్థానాల్లో, ఎవ్వరూ ఊహించని విధంగా, అంచనాలు పూర్తిగా తల్లకిందులు కావడానికి ఈ కొద్ది సమయమే కారణమవుతుంది.

తెలంగాణలో అలాంటి ప్రమాదం దాదాపు లేదు. కాని, ఆంధ్రలో మాత్రం చాలా ఉంది. ఉంటుంది.

ఏపీలో రాజకీయంగా ఒక పెనుమార్పుకి కారణం కాబోతున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్‌తో పాటు, ఆ పార్టీ అతిరథమహారథుల నుంచి, క్రింది స్థాయి కార్యకర్త దాకా ఈ కొద్ది సమయం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలను ప్రభావితం చేయగల ప్రతి చిన్నా పెద్దా విషయం మీద తగినంత ఫోకస్ పెట్టాలి.

అవతల ఉన్నది 40 యియర్స్ ఇండస్ట్రీ.

ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలడు. చివరి నిమిషం వరకూ కొత్త అవకాశాల్ని సృష్టించుకొని దెబ్బదీసే ప్రయత్నంలోనే ఉంటాడు.

తస్మాత్ జాగ్రత్త! 

కౌంట్ డౌన్ ... 2

ఎన్నికల ప్రచారపర్వానికి ఇంక మిగిలింది 2 రోజులే.

ఇందాకే ఒక యూకే మిత్రునితో మాట్లాడుతుంటే ఈ విషయం మా మాటల్లో వచ్చింది.

ఖచ్చితంగా చెప్పాలంటే జస్ట్ ఒక 39 గంటల్లో ఈ ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తుంది. తెలంగాణలో, పక్కన ఏపీలో కూడా.

కేసీఆర్ రాజకీయ వ్యూహం పుణ్యమా అని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల గురించి పెద్దగా చర్చించడానికి ఏమీ లేకుండాపోయింది.

నల్లేరు మీద నడక.

వన్ సైడ్ వార్.

16 సీట్లు పక్కా.

ఎక్జైట్‌మెంట్, చర్చా గిర్చా ఏదైనా ఉందంటే - అది మెజారిటీ ఎక్కడ ఎంత అన్నదానిమీదే తప్ప ఇంక వేరే ఏమీ లేదు.

అలాగని దేన్నీ ఎవ్వరూ లైట్ తీసుకోలేదు.

టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో 20 మంది స్టార్ కాంపెయినర్లు బాగా పనిచేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీఆరెస్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు ఉన్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రెటరీ, టీయస్ఎమ్‌డీసీ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారు. 

ఒకవైపు కేసీఆర్ ప్రచార సభలు, మరోవైపు కేటీఆర్ సభలూ రోడ్ షోలు, ఇంకా ప్రతి ఒక్క ఎంపీ స్థానంలో ఆయా అభ్యర్థుల సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, వివిధ సంఘాలు, సమూహాలతో ప్రత్యేక మీటింగ్స్ .. అన్నీ భారీ స్థాయిలో, యమ సీరియస్‌గా జరుగుతున్నాయి.

ఇవన్నీ ఇంకో 39 గంటల్లో ముగియనున్నాయి.

తెలంగాణలో టెన్షన్ ఏం లేదు. టీఆరెస్ "మిషన్ 16" సక్సెస్ కాబోతోంది.

ఇక మిగిలింది .. మే 23 నాడు ఫలితాలు అఫీషియల్‌గా చూడ్డమే.

కట్ టూ ఏపీ పాలిటిక్స్ - 

సర్వేలన్నీ చంద్రబాబు పరాజయాన్ని, తిరుగులేని జగన్ వేవ్‌ను చెప్తున్నాయి.

అయినా సరే, చంద్రబాబు 2014 తరహాలో చివరి నిమిషంలో వేవ్‌ను తనవైపు తిప్పుకొని విజయం సాధిస్తాడని కూడా కొన్నివర్గాల అభిప్రాయం.

జగన్ శిబిరం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటోందనే అనుకుంటున్నాను.   

Tuesday 2 April 2019

మన అంతరంగంతో మనం

వ్యక్తిగతంగా, నా దృష్టిలో ఏకాంతాన్ని మించిన సహచరి లేదు!

అలాగని నన్ను తప్పుగా అనుకోకండి.

నాకత్యంత ప్రియమైన నా ఫ్రెండ్స్ తో గడపడం నాకెంతో ఇష్టం. నా పిల్లలతో కలిసి ఆటలాడ్డం, వాళ్ల వయస్సుకి దిగిపోయి పోట్లాడ్డం నాకిష్టం.

ఫ్రెంచి ఆర్టిస్టులతో కలిసి పాండిచ్చేరి బీచుల్లో గంటలకొద్దీ నడుస్తూ స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడ్డం నాకిష్టం. ఇలాంటి ఇష్టాలు కనీసం వంద ఉన్నాయి నాకు.

కానీ.. వీటన్నింటిని మించి నాకత్యంత ఇష్టమైంది నా ఏకాంతం. అందుకే అన్నాను, ఏకాంతాన్ని మించిన సహచరి లేదు నాకు అని. 

ఏకాంతాన్ని సృష్టించుకోడానికి ఎవరూ అన్నీ వొదులుకొని మునిపుంగవులు కానక్కర లేదు. ఇరవై నాలుగ్గంటల్లో ఇరవై గంటలూ ఈ ఏకాంతం కోసమే కెటాయించనక్కర్లేదు.

కేవలం ఒక్క అరగంట! వీలయితే ఇంకో పది నిమిషాలు ... 

మనతో మనం, మన అంతరంగంతో మనం, మన ఆలోచనలతో మనం, మన ఆత్మతో మనం, మన మనసుతో మనం ... ప్రశాంతంగా రోజుకి కనీసం ఒక్క అరగంట కెటయించుకోగలిగితే చాలు. ఆ ఆనందం వేరు. ఆ ఎనర్జీ వేరు.

ఏకాంతంలో ఉన్నప్పుడే మనల్ని మనం పలకరించుకోగలుగుతాం.సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందాన్ని ఆనందించగలుగుతాం.

ప్రపంచంలో ఏఅత్యుత్తమ కళ అయినా పుట్టేది ఇలాంటి ఏకాంతంలోంచేనంటే అతిశయోక్తి కాదు. ఏకాంతంలోనే ఏ సృజనాత్మకత అయినా వెల్లివిరిసేది.

సముద్రాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, ఏకాగ్రతతో ఏదయినా రాస్తున్నప్పుడు.. మనం అనుభవించేది ఏకాంతమే.

ఏ కళాకారుడయినా తనలోని క్రియేటివిటీని ఆవిష్కరించేది ముందు ఏకాంతంలోనే. అది ఆర్ట్ కావచ్చు. సైన్స్ కావచ్చు. కొత్త ఆలోచన ఏదైనా సరే ఏకాంతం నుంచే పుడుతుంది. అదొక రూపం సంతరించుకొని భౌతిక ప్రపంచానికి పరిచయమయ్యేది ఆ తర్వాతే!

ఏకాంతం లేకుండా ఏ సృజనాత్మకత  లేదు. ఏ కళ లేదు. దాన్ని మనం విస్మరిస్తున్నాం. నిజానికి, ఈ ఆధునిక జీవితంలో ఏకాంతాన్ని విస్మరించి మనం సాధిస్తున్నది కూడా ఏదీ లేదు. కోల్పోతున్నదే ఎక్కువ.

అంతేకాదు ...

మన నిత్యజీవితంలోని కొన్ని సమస్యలకు మామూలు పరిస్థితుల్లో దొరకని పరిష్కారం కూడా మనకు ఏకాంతంలోనే దొరుకుతుంది.

ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. కానీ, అలా ఆలోచించాలన్నా మీకు ఏకాంతం కావాలి!

కట్ టూ సమ్ యాక్షన్ - 

ఓ పని చేయొచ్చు ...

మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ 'ఆఫ్' చేసేసి, మీ ఇంట్లోనే మీకిష్టమయిన గదిలోనో, మీకిష్టమయిన ఏదో ఒక మూలనో కేవలం ఒక్క అరగంట ఒంటరిగా కూర్చుని చూడండి.

లేదంటే ఏ తెల్లవారుజామునో, సాయంత్రమో.. మొబైల్ జేబులో పెట్టుకోకుండా, ట్రాఫిక్ లేని చోట ఒక అరగంట మీరొక్కరే వాకింగ్ కు వెళ్లండి.

ఏకాంతం ఎంత అందంగా, ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరేం కోల్పోతున్నారో తెలుస్తుంది. అందుకోసం, ఇకనుంచయినా మీరేం చేయాలో మీకు తెలుస్తుంది.

అన్నట్టు ... ఈ బ్లాగ్ పోస్టు పుట్టింది కూడా 'ఏకాంతం' లోంచే!

Monday 1 April 2019

FB లో లేని ఆ 154 రోజులు!

ఏం ఫరవాలేదు.

ఫేస్‌బుక్ వదిలేసి 154 రోజులైంది.

ఏం కాలేదు. ఇంకా బ్రతికే ఉన్నాను. హాయిగా ఉన్నాను.

కట్ చేస్తే - 

ఫేస్‌బుక్ అంటే నాకు చాలా ఇష్టమే. అది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం కాదు.

మంచి మిత్రులనిచ్చింది. మంచి కాంటాక్ట్స్‌ను కూడా ఇచ్చింది.

నిజానికి ఇప్పటికి కూడా .. ఏ విషయంలోనైనా, గ్లోబ్ మీదున్న ఏ ప్రాంతం నుంచయినా మనకేదైనా కాంటాక్ట్ కావాలంటే ఫేస్‌బుక్కే ఒక మంచి టూల్.

కాకపోతే, ఈమధ్య ఫేస్‌బుక్ ఒక ఫిష్ మార్కెట్ అయిపోయింది.

ఎవరికి తోచిన చెత్త వారు పోస్ట్ చేసుకొనే ఫ్రీడం ఉన్నది కాబట్టి ఎవర్నీ తప్పుబట్టటానికి వీల్లేదు.

నేను ఫేస్‌బుక్ వాడినప్పుడు రోజుకి మొత్తంగా ఒక 30-40 నిమిషాలు దానిమీద గడిపేవాన్ని. నా పోస్టుల్లోకూడా కనీసం ఒక 60 శాతం పనికిరాని చెత్తనే.

అదంతే.

నాణేనికి మరోవైపు.

మన నంబర్ 2 అన్నమాట.

ప్రతిమనిషిలోనూ ఉండే ఈ నంబర్ 2 బయటకు కనిపించదు. ఫేస్‌బుక్‌లో మాత్రం విశ్వరూపం చూపిస్తుంది.

ఎక్కడా ఏం చేయలేనివాడు ఇక్కడ అన్నీ చేస్తాడు. చెప్తాడు.

ఒక ఫాంటసీ.

ఒక మాయ.

ఇప్పుడు నేను ట్విట్టర్‌ను బాగా ఇష్టపడుతున్నాను.

ఇది ఫిష్ మార్కెట్ కాదు. ఒక ఎలైట్ సోషల్ మీడియా. ఎంతవాగినా, ఏం చెప్పినా దానికొక పరిమితుంది. 

జస్ట్ 280 క్యారెక్టర్స్!