Thursday 28 February 2019

ముందు అభినందన్‌ను వెనక్కి తెప్పించండి!

యుధ్ధంలో మొట్టమొదట గాయపడేది నిజం!

పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత 12 రోజులపాటు రెండువైపుల నుంచి ఎలాంటి శబ్దంలేదు.

13వ రోజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులమీద సుమారు 20 నిమిషాలపాటు విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది.

300 మంది టెర్రరిస్టులు, పాక్ ట్రెయినర్లను హతం చేశాం అని భారత్ చెప్పుకొంది. మనం కూడా "జయహో భారత్" అనుకొన్నాం. అయితే - పాక్ మీడియా కాని, విదేశీ మీడియా కాని సర్జికల్ స్ట్రైక్‌లో 300 మంది హతులైన విషయాన్ని ధృవీకరించలేదు.

ఏది నిజం?   

కట్ చేస్తే - 

మరొక 24 గంటల్లోనే పాక్ ఫైటర్ విమానాలతో మన భూభాగంపైన దాడి చేసింది .. దాన్ని తిప్పికొట్టడంలో మన వాళ్లు విజయం సాధించారు .. ఒక పాక్ ఫైటర్ విమానాన్ని కూల్చేశాం .. ఈ చర్యలో భాగంగా మన యుధ్ధవిమానం ఒకటి కూలిపోయింది .. మన పైలట్ ఒకరు మిస్సింగ్ .. పరిస్థితిని సమీక్షిస్తున్నాం ..

ఇలా చకచకా ఒకదానివెంట ఒకటి సంఘటనలు జరిగాయి. లేదా వివిధ సోర్సుల ద్వారా జరిగాయని విన్నాం, చదివాం, చూశాం.

నిజానికి భారత్ ఏమీ చెప్పక ముందే రష్యా టుడే, పాకిస్తాన్ న్యూస్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ కస్టడీలోకి తీసుకొన్న వార్తను చెప్పేశాయి.

ప్రపంచమంతా అది నిజమా అబధ్ధమా అనుకుంటూ ఒక 4 గంటలు గడిపిన తర్వాత .. మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి ప్రెస్‌ముందు ఆ విషయం ధృవీకరించాడు!

అసలు పాక్ భూభాగంలో మన పైలట్ అభినందన్ వారికి ఎలా దొరికాడు?

జెనీవా కన్వెన్షన్ రూల్స్‌కు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ అభినందన్‌ను అంత ఓపెన్‌గా ఏ ధైర్యంతో అలా చిత్రవధ చేయగలిగింది? తర్వాత మళ్లీ అతన్ని మేం బాగా చూసుకుంటున్నాం అని ఒక వీడియో డ్రామా ఎందుకు ఆడింది? ఇప్పుడు అభినందన్‌ను గుప్పిట్లో పెట్టుకొని "మేం చర్చలకు సిధ్ధం" అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంత కూల్‌గా ఎలా అనగలుగుతున్నాడు?

అసలేం జరిగింది?

ఇప్పుడేం జరగబోతోంది?

జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను 7 రోజుల లోపల సురక్షితంగా మనకు అప్పగించాలి. ఆ పని ఇప్పుడు పాక్ చేస్తుందా?

ఎన్నో అనుమానాలు .. మరెన్నో ప్రశ్నలు.

అందుకే అన్నారు - "The first casualty of war is - truth" అని.

పాక్ ఏమీ చెయ్యలేదు .. మనముందు ఉట్టిదే అనుకున్నాం.

అంత ఉట్టుట్టిదేం కాదు అని తేలిపోయిందిప్పుడు.

రెండు దేశాల మధ్య యుధ్ధమంటూ జరిగితే ఇదివరకటిలా నెలలూ, సంవత్సరాలు జరగదు. రెండు దేశాల్లోని ముఖ్యమైన ప్రధాన నగరాలు కేవలం కొన్ని గంటల్లోనే బూడిదైపోతాయి.

మనకున్న భారీ యుధ్ధ సామగ్రి, బలగం, శక్తి రీత్యా చివరికి మనమే గెలుస్తాం. కానీ అప్పటికే చాలా మూల్యం చెల్లించుకొంటాం.

పాక్ విషయంలో కూడా అంతే. దాదాపు నామరూపాల్లేకుండా పోతుంది.

ఇక యుధ్ధం అంటూ మొదలైతే అది ప్రపంచస్థాయిలో కూడా ఏ క్షణం ఎలాంటి మలుపుకయినా దారితీసే ప్రమాదముంటుంది.

కట్ బ్యాక్ టూ మన అభినందన్ -    

ఇప్పుడు పాక్ గుప్పిట్లో మన వింగ్ కమాండర్ ఉన్నాడు.

వాళ్లు చిత్రవధలు పెట్టినా "నన్ను బాగా చూసుకొంటున్నారు" అని కాఫీ తాగుతూ కూల్‌గా వీడియోలో చెప్పాడు. కానీ, అందులో నిజమెంతో అభినందన్‌ను పట్టుకున్న అంతకు ముందటి వీడియోనే చెప్తుంది.

ఇమ్రాన్ ఖాన్ చెప్పాల్సింది చెప్పాడు, "చర్చలకు మేం రెడీ" అని.

బాల్ ఇప్పుడు మన కోర్టులో ఉంది.

భారత్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

పాక్ కస్టడీలో ఉన్న మన వింగ్ కమాండర్  అభినందన్‌ను సురక్షితంగా వెనక్కి రప్పించగలదా?
 
ఈ ప్రశ్నకు జవాబు ఒక్క మోదీ మాత్రమే చెప్పగలడు.   

Tuesday 26 February 2019

వొక నమ్మకం

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.

అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.

అయితే, చాలాసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది. లేదా, అక్కడే ఆ గోడకి జారుకుంటూ కింద కూలబడింది.

దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?

ఎవరు నమ్ముతారు?

ఏ లాజిక్ ప్రకారం ఆలోచించినా, ఏ కోణంలో చూసినా - నా అనుభవంలో చాలాసార్లు జరగాల్సినవి జరగలేదు. జరక్కూడనివి జరిగాయి. 

సో, లాజిక్కులు పనిచేయని సందర్భాలు మనిషి జీవితంలో చాలా వస్తాయి. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. మనకు కన్వీనియెంట్‌గా అనిపించిన ఏదో ఒక "శక్తి" మీద మన భారం అంతా వేసి ముందుకు వెళ్లడం.  

విచిత్రంగా అప్పుడంతా బాగానే ఉంటుంది.

అదే నమ్మకం. 

"ఓవర్ నైట్ సక్సెస్" అనేది అసలుందా?

"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం. 

అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

అసలంత సీనుంటుందా? 

రాత్రికిరాత్రే దొంగతనం చేసి ధనవంతుడైన ఒక దొంగ విషయంలో కూడా అంతే. ఆ ఒక్క రాత్రి లూటీ చేసి విజయం సాధించడం వెనుక ఆ దొంగ ఎన్నేళ్ల ప్రాక్టీసు, ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు?

ఒక సైంటిస్ట్ అయినా, ఒక క్రియేటివ్ పర్సన్ అయినా, ఒక ప్రొఫెషనల్ అయినా, ఇంకే రంగంలో వారైనా సరే .. అందరికీ ఇదే వర్తిస్తుంది. 
 

సో, నా దృష్టిలో అసలు ఓవర్‌నైట్ సక్సెస్ అనేది లేదు. 

దేశంలోని టాప్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తన తొలిచిత్రం నుంచి వరుసగా నాలుగు కమర్షియల్ ఫ్లాప్‌లు ఇచ్చిన విషయం ఎంతమందికి తెలుసు?

"మౌనరాగం" హిట్టు ఆతర్వాతే! 


హిట్ దర్శకుడు కాదని అప్పట్లో లీడ్‌లో ఉన్న ఒక హీరోయిన్ మణిరత్నం చిత్రంలో పనిచేయడానికి ఒప్పుకోలేదు. టాప్ దర్శకుడయ్యాక, అదే మణిరత్నం ను ఆ హీరోయిన్ పెళ్లాడింది. ఇంక ఆ హీరోయిన్ పేరు చెప్పడం అవసరమా? 

Success is always sexy. 

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది. 

“It took 15 years to get overnight success!”  అని. 

ఇదే కొటేషన్ను సుమారు పదేళ్ల క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకం లో చదివాను. 

ఓవర్ నైట్ సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు.

వారికి కనిపించేది రెండే రెండు విషయాలు: 
సక్సెస్, ఫెయిల్యూర్. 

Sunday 24 February 2019

వొక నీహారిక కోసం

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

ఈ ఒక్క వాక్యం నేను నా బ్లాగ్‌లో కనీసం ఒక డజన్ సార్లు రాసుంటాను.

అంతే కాదు.

రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు కూడా వేరు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక రేంజ్‌లో ఉతికి ఆరేసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు .. కేసీఆర్, కేటీఆర్‌లు తర్వాత ఎలా సమావేశాలు, పార్టీల్లో కలుస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

తప్పేం లేదు.

ఆంధ్రాలో రెండు బధ్ధవిరోధ పార్టీలకు చెందిన లీడర్లు కొందరు సాయంత్రమైతే క్లబ్బుల్లో కలసి సరదాగా పెగ్గేసి మాట్లాడుకోవడం నాకు తెలిసిన మరొక చిన్న ఉదాహరణ.

ఇది కూడా తప్పేం కాదు.

నా వ్యక్తిగత/వృత్తిగత పనులమీద తరచూ నేను వైజాగ్, గుంటూరు, విజయవాడ వెళ్తుంటాను. ఆ నేపథ్యంలోనే నేను స్వయంగా తెలుసుకొన్న విషయం ఇది.

నాకు తెలంగాణలో ఉన్న స్నేహితులు బంధువులకంటే, ఏపీలోనే ఎక్కువమంది ఉన్నారు. నా టీమ్‌లో పనిచేసేవారిలో కూడా అందరూ ఉన్నారు. అదసలు పాయింట్ కానే కాదు.   

క్రియేటివిటీకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి రాజకీయాల్లో సొంత అభిప్రాయాలు, సొంత భావనలు, దృక్కోణాలూ ఉండకూడదని ఎక్కడా లేదు. క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇది చరిత్రలో ఉంది.

నా మాట మీద నమ్మకం లేనివాళ్లు ఒక్క సారి గూగుల్లో కొడితే సరిపోతుంది.

కావల్సినంత చరిత్ర దొరుకుతుంది.

అయితే, తవ్వకాల్లో దొరికే చరిత్ర, ఫిలాసఫీల్లో కూడా రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి.

ప్లేటో ఒకటి చెప్తాడు. అరిస్టాటిల్ ఇంకోటి చెప్తాడు.

అది వేరే విషయం.

కట్ టూ నీహారిక - 

నీహారిక పేరు బావుంటుంది.

నాకు గుర్తున్న వొక నీహారిక ('నీహారిక నాయుడు' అనుకుంటాను) అప్పట్లో ఫేస్‌బుక్‌లో మషీన్ గన్ పేల్చిన రేంజ్‌లో పోస్టులు పెడుతుండేవారు. సడెన్‌గా ఆ పేలుళ్ళు ఆగిపోయాయి. లేదా నేను ఫేస్‌బుక్‌ను పట్టించుకోవడం మానేశాను కాబట్టి ఆ నీహారికను మిస్ అవుతున్నానో తెలియదు.

ఎనీవేస్, ఆ నీహారిక వొకరు.

ఇంకో నీహారిక నా బ్లాగ్ పోస్టులను వొకటి రెండుసార్లు చడా మడా ఏకిపారేసిన నీహారిక.

బ్లాగ్ రాసే క్రియేటివ్ ఫ్రీడం నాకెంత ఉందో, నా బ్లాగ్ పోస్టులను విమర్శించే ఫ్రీడం రీడర్స్‌కు కూడా తప్పక ఉంటుంది. ఈ విషయాన్ని నేనంత పర్సనల్‌గా తీసుకోను.

నేనొక రాజకీయ నాయకుణ్ణి ఇష్ట పడతాను. ఆయన పార్టీని ఇష్టపడతాను.

ఇంకొకరు ఇంకో నాయకుణ్ణి/నాయకురాలిని ఇష్టపడొచ్చు. వారి పార్టీని ఇష్టపడొచ్చు.

ఈ కోణంలో చూసినప్పుడు - ఎవరి వ్యూ పాయింట్ వారికుంటుందనేది చాలా స్పష్టం. సమర్థించుకోడానికి కూడా ఎవరి వాదనలు వారికుంటాయి.

ఇది సర్వ సహజం.

దట్ సింపుల్.

నిజంగా ఇలాంటి నీహారికలు లేకపోతే, బ్లాగింగ్ కూడా బోరింగ్ అవుతుంది.

సో, థాంక్స్ టూ మై బ్లాగ్ రీడర్ నీహారిక.

అంతకు ముందు తన కామెంట్‌తో నా బ్లాగ్‌లో ఒక పోస్ట్ గురించి ఈ నీహారిక ఏకేసినప్పుడు, తన ఆ కామెంట్ ఇన్స్‌పిరేషన్‌తో ముత్యాలముగ్గు సినిమాలోని ఒక మంచిపాట గుర్తుకొచ్చింది నాకు.

వెంటనేదాని మీద ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను.

సో, అంతా మన మంచికే అన్నమాట! 

ఈ నీహారిక, నేను ముందు చెప్పిన నీహారిక బహుశా ఒక్కరే అయ్యుంటారేమోనని నాకెందుకో ఎక్కడో కొడుతోంది.

కావొచ్చు, కాకపోవచ్చు కూడా.

ఏదేమైనా, నా తర్వాతి సినిమా హిట్ కోసం ఆశిస్తున్న ఈ నీహారిక త్వరలోనే ఒక మంచి స్క్రిప్టు నాకు ఇస్తారనీ, ఒక మంచి సౌండ్ ప్రొడ్యూసర్‌ను కూడా కనెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :)  

వొక పుల్వామా తర్వాత ...

మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా వారి ఈగోలు పక్కనపెట్టి కాసేపు మాట్లాడుకొంటే అసలు దేశ విభజన జరిగేదే కాదు. 

పాకిస్తాన్ అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచపటంలో ఉండేది కాదు. కాశ్మీర్ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు.

ఒక హైద్రాబాద్‌లాగా, కాశ్మీర్ రాజ్యం కూడా భారత్‌లో భాగమయిపోయేది. ఆ భూతలస్వర్గం మరింతగా భాసించేది.

ఒక లాల్ బహదూర్ శాస్త్రిలాగానో, ఒక ఇందిరా గాంధీలాగానో మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా కేవలం దేశంకోసమే నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఒక రావణకాష్టంలా కాశ్మీర్ సమస్య ఈరోజుకి కూడా ఇలా రగులుతుండేది కాదు. 

కేవలం తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని తన "పంచశీల" అనే పనికిరాని ఐదు సూత్రాలతో, ఐక్యరాజ్యసమితిలో గొప్పలకోసం, అప్పటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితికి పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో, ఆ రోజునుంచీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలతో భూతలస్వర్గం కాశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది.

1947 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా, ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని ఒప్పుకోడానికి మనలో చాలామంది ఏమాత్రం ఇష్టపడకపోవచ్చు.

కానీ, చరిత్ర చెప్తున్న నిజం అదే.

ఆ తర్వాత సుమారు అర్థ శతాబ్దం పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, అధికారంలో ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాలు, ప్రధానులు తీసుకొన్న మరిన్ని తప్పుడు నిర్ణయాలు, రూపొందించిన పాలసీలు, చట్టాలు కాశ్మీర్‌ను ఎప్పటికప్పుడు ఒక అశాంతిమయమైన రాష్ట్రంగానే మిగిల్చాయి తప్ప ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లలేకపోయాయి.

అయితే, అప్పటి నుంచీ ఇప్పటి దాకా బలయ్యింది మాత్రం సుమారు 40 వేలమంది సైనికులు, వారి కుటుంబాలు.

మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ కూడా అలాంటిదే.

మరోవైపు చైనా విషయంలో కూడా మన ప్రభుత్వాల చేతకానితనం అత్యంత బాధాకరం. చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకొని, ఆదేశం నుంచి దిగుమతులను పూర్తిగా ఆపేస్తే చాలు. ఆ దేశపు ఆర్థిక చిత్రం ఒక్కసారిగా ఛిద్రమైపోతుంది. ఆ ఒక్క పని మన ప్రభుత్వాలు చేయవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - చైనా విషయంలో మనమే డబ్బు అందిస్తూ, మన పక్కలో శత్రువును మనమే బలంగా పెంచుకుంటున్నాం. 

తమ దేశ భద్రత విషయంలో అణుమాత్రం కూడా రాజీపడని అమెరికా వంటి అగ్రదేశం పైన కూడా టెర్రరిస్టులు అత్యంత దారుణమైన స్థాయిలో దాడిచేయగలిగారు. తర్వాత అంతే కర్కశంగా ప్రపంచంలో ఎవ్వరూ ఊహించనివిధంగా ఆ దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్‌ను ఇదే పాకిస్తాన్ నుంచి పట్టుకెళ్లి హతం చేసింది అమెరికా.

బిన్ లాడెన్‌ ఖననస్థలం కూడా ప్రపంచపటంలో లేకుండా ఎక్కడో ఎవ్వరికీ తెలియని సముద్ర గర్భంలో బూడిదలా కలిపేసింది.

తమ దేశ పౌరుల భద్రత విషయంలో, టెర్రరిస్టుల విషయంలో అమెరికా తీసుకొనే చర్యలు చాలావరకు అనుసరణీయం.

కానీ ఈ విషయంలో మనమెక్కడున్నాం? ఎంత వెనుకుబడి ఉన్నాం?     

అటు పాకిస్తాన్‌తో అయినా, ఇటు చైనాతో అయినా - ద్వైపాక్షిక సంబంధాల చర్చల విషయంలో మనం ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. అవన్నీ ఎప్పుడూ అర ఇంచు ముందుకు కదలవు. మీడియాల్లో వార్తలు, ఫోటోలు, ఎయిర్‌పోర్టుల్లో కటౌట్‌లవరకే పరిమితం. ఖర్చుమాత్రం కోట్లల్లో చేస్తారు.

ఎంత పెద్ద స్థాయి సమస్యలకయినా కొంచెం ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం అనేది తప్పక దొరుకుతుంది. కాకపోతే, దానికి కావల్సింది కేవలం రాజకీయాలు తెలవడం ఒక్కటే కాదు. ఆయా సమస్యల మూలాలపట్ల సమగ్ర అవగాహన ఉండాలి. పరిష్కారం దిశగా గురి తప్పని ఒక  వ్యూహం ఉండాలి. వీటన్నిటికీ తోడు, వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధాల స్థాయికి కూడా ఎదిగి, సమస్యలకు పరిష్కారం సాధించుకోగల నేర్పు కూడా కావాలి. ప్రస్తుతం మన దేశంలో ఈ స్థాయి, ఈ లక్షణాలన్నీ ఉన్న రాజకీయవేత్త కేసీఆర్ ఒక్కరే.

కేసీఆర్ లాంటి నాయకుడు దేశప్రధానిగా ఉండటం వల్ల దశాబ్దాలుగా నత్తనడక నడుస్తున్న ఎన్నో సమస్యలు అతివేగంగా పరిష్కరించబడతాయండంలో సందేహంలేదు.

ఈ దిశలో కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించేలా భావ సారూప్యత ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వటం ఇప్పుడు చాలా అవసరం.   

తను బ్రతుకున్న దేశం శాంతియుతంగా ఉండాలనే ఏ ముస్లిం అయినా కోరుకుంటాడు. కేవలం వారి వోటు బ్యాంక్ కోసం లేనిపోని అభద్రతాభావాలతో అవసరమైనప్పుడు కూడా దేశం లోపలా, బయటా స్పందించాల్సిన విధంగా స్పందించకపోవడం కేవలం చేతకానితనం, దేశద్రోహం కూడా. 

మన రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు అలాంటి ద్రోహాన్నే చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

ఒక్క కాశ్మీర్ విషయంలోనే కాదు. దేశ సమగ్రతకు, భద్రతకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా ఇదే చేతకాని సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తుండటం అత్యంత విచారకరం.

ఈమధ్యకాలంలో ఒక్క 1999 కార్గిల్ వార్ విజయం ఒక్కటే దీనికి మినహాయింపు. ఆ ఘనత మచ్చలేని దేశభక్తుడు, రాజకీయవేత్త, అప్పటి ప్రధాని వాజపేయీకే దక్కుతుంది. మన సైన్యానికి దక్కుతుంది.

బంపర్ మెజారిటీతో, ఏ ఇతరపార్టీల సహాయం అక్కరలేకుండానే ప్రభుత్వం ఏర్పాటుకోగలిగిన ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత అయిదేళ్ల కాలంలో ఈ దిశలో ఏమీ చెయ్యలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. కానీ, ఇప్పుడు అవకాశం మోదీ కళ్ళముందుంది. ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు. ఆ ధ్వంసరచన ఇప్పటికే జరిగి ఉండాల్సింది ..

మన 40 మంది పుల్వామా వీర జవాన్ల ఖననానికి ముందే. 

Saturday 23 February 2019

వొక చరిత్రకు అయిదేళ్లు!

తెలంగాణ వస్తే అదైపోద్ది, ఇదైపోద్ది అని ఓ నానారకాల కథలు చెప్పారు.

ఇప్పుడేమైంది?

కరెంటు లేక, తెలంగాణ మొత్తం అంధకారమైపోతుందన్నాడొకాయన.

నియాన్ లైట్ల వెలుగులో అసలు కంటికి కనిపించకుండాపోయిన అతనెక్కడ?

నిండు అసెంబ్లీలో "మీ తెలంగాణకు ఒక్క పైసా ఇయ్యనుపోండి" అని .. అదే చిత్తకార్తె మనిషి మొరిగాడు.

ఇప్పుడు అదే అసెంబ్లీలో మా తెలంగాణకు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం.

ఎక్కడా పెద్దమనిషి?

రాయాలంటే ఇదో పెద్ద లిస్ట్ అవుతుంది.

కట్ చేస్తే - 

400 కి పైగా పథకాలు.
40 వేల కోట్లకు పైగా నిధులు.

నిరంతరం కరెంటు.
నిండిన చెరువులు.
పారుతున్న నీళ్లు.
గ్లోబల్ బిజినెస్‌ల ప్రవాహం.
పెరుగుతున్న ఆదాయం.
ప్రపంచవ్యాప్తంగా పేరు.
అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు, కేంద్రం.

గత 70 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరగని పనులు ఇక్కడ ఒకే ఒక్క టర్మ్‌లో పూర్తిచేసి మరీ చూపించడం.

గత 70 ఏళ్లలో ఏ ఇతర రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని ఎవ్వరూ కలలో కూడా చూడని పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టి పరుగెత్తించడం.   

అనుక్షణం తెలంగాణ కోసం తపన.
అహరహం ఆలోచనలు.
అమితవేగంతో ఆచరణ.

విజయవంతమైన మొదటి ఐదేళ్లలో ఇవీ మనం చూసిన నిజాలు.

రెండోసారి ఎలెక్షన్లలో కూడా తిరుగులేని విజయ దుందుభి.

దటీజ్ కేసీఆర్.

కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సి ఎం మాత్రమే కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదం. తెలంగాణకు పర్యాయపదం. మూర్తీభవించిన మానవత్వానికి పర్యాయపదం.

కేసీఆర్ అంటే .. ఒక చరిత్ర. 

Friday 22 February 2019

Time to Take Massive Action!

రెండు కొత్త సినిమాలు, సోషల్‌మీడియా ప్రమోషన్, మ్యూజిక్ వీడియోలు, మ్యూజిక్ ఈవెంట్స్, షోస్, ఒక బుక్ రిలీజ్, ఒక డాక్యుమెంటరీ .. ఇట్లా చిన్నా, పెద్దా ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతున్నాయి.

ఏప్రిల్ 30 దాకా ఊపిరి తీసుకోడానికి కూడా వీలు కానంతగా పనులు పెట్టుకున్నాము.   


Taking massive action! 


వీటిలో ప్రతి ఒక్కటీ వృత్తిపరంగా ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైనదే. దేన్నీ అంత ఈజీగా తీసుకోవడం లేదు.

అన్నీ టైమ్ బౌండ్ ఉన్నవే.

సో, ఎన్నోరకాల వత్తిళ్ళు ఉన్నా
 ఏ ఒక్క పనినీ నేను వాయిదా వెయ్యటం లేదు. 

ఇవి ఒక్కొక్కటి ప్రారంభమౌతుంటే .. 
వీటికి సంబంధించిన చిన్న చిన్న తలనొప్పులు, అడ్డంకులు ఏవైనా ఉంటే అవే తొలగిపోతాయి. 

నా ఈ జర్నీలో నాతోపాటు పయనిస్తున్న 
వీరేంద్ర లలిత్, ప్రదీప్‌చంద్ర, ఇంకా మొత్తం
నా టీమ్‌కు 
అభినందనలు.

క్రియేటివిటీకి సంబంధించిన పనుల్లోని అన్‌సర్టేనిటీని అర్థం చేసుకొని, మాకు సహకరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ 
కూడా బిగ్ థాంక్స్.

కట్ చేస్తే - 

ఈరోజునుంచే కొత్త ఆర్టిస్టులు, సింగర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ కోసం యాడ్స్ ప్రారంభిస్తున్నాము. ఆడిషన్, సెలెక్షన్స్ మార్చిలో ఉంటాయి.   

Wednesday 20 February 2019

ఇప్పుడు సోషల్ మీడియాను మించిన ప్రమోషన్ లేదు!

నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

అది పాలిటిక్స్ కావొచ్చు, స్పోర్ట్స్ కావొచ్చు, బిజినెస్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు.

అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే. 

కట్ టూ సినిమా ప్రమోషన్ - 

ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఖర్చు కూడా ఎక్కువే. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!

ఖర్చు చాలా తక్కువ.

చెప్పాలంటే మొత్తం ఫ్రీ! 

ఉదాహరణ: 'లక్ష్మీ's NTR' సినిమా. ఆర్జీవీ ట్వీట్స్.

ఆఖరికి ఆ సినిమా ట్రయలర్లు కూడా ట్విట్టర్ ద్వారానే రిలీజ్!  


ఇంక ఆ సినిమాకు వేరే ప్రమోషన్ అక్కర్లేదని నా అభిప్రాయం. 

అందరూ ఆర్జీవీలా చేయలేకపోవచ్హు. కానీ, సోషల్ మీడియా ఆయుధం అక్కడుంది కళ్లముందు. ఎవరి టాలెంట్ వారిది. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!
  

అయితే, సోషల్ మీడియా పవర్ గురించి ఎంత తెలిసినా .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఇండస్ట్రీలోని కొంతమంది సంతృప్తికోసం కొన్ని పాతపధ్ధతులు కూడా పాటించక తప్పటంలేదు. 

అది మనవాళ్ల మైండ్‌సెట్. 

కానీ, ఎవరు ఎన్ని పాత పధ్ధతులు పాటించినా,  సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది. 

అది హాలీవుడ్ అయినాసరే, టాలీవుడ్ అయినాసరే.   

Tuesday 19 February 2019

మనీ .. 3 సూత్రాలు!

నా పాత బ్లాగ్ పోస్టులను ఒక్క నిమిషం అలా బ్రౌజ్ చేస్తోంటే ఇది కనిపించింది:

"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు.

నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం.

దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను, ఎలాంటి హిపోక్రసీ లేకుండా.

> రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అది తప్పు అనటంలేదు. కానీ, వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!

> అంతర్జాతీయంగా వివిధరంగాల్లో  అత్యుత్తమ స్థాయి విజయాల్నిసాధించి బిలియనేర్లు అయినవారిలో 96 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూల్, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!
 
> సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో అత్యధికభాగం మంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే!

కట్ టూ నీతి -       

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు.

2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.

3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నాకేం కావాలి? నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.

పై 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.

నేనూ అంతే. ఈ విషయంలో చాలా ఆలస్యంగా రియలైజ్ అయ్యాను.

బట్, నో వర్రీ ...

ఇప్పుడు, రియలైజ్ అయిన మరుక్షణం నుంచైనా, వొళ్లు దగ్గరపెట్టుకొని, "మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి" అన్న విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే చాలు.

ఫలితాలు అవే ఫాలో అవుతాయి.

డబ్బు కూడా.   

New Script Writers Wanted!

కొత్త సినిమా స్క్రిప్ట్ రైటర్స్‌కు వెంటనే అవకాశం!

ఇది ఉద్యోగ అవకాశం కాదు.

సినిమా ఇండస్ట్రీలోకి  మీరు ప్రవేశించడానికి అవకాశం. అదీ, మీలో ఉన్న టాలెంట్‌నుబట్టి. మీలో ఉన్న ప్యాషన్‌ను బట్టి.

కట్ టూ పాయింట్ - 

టెక్నికల్‌గా ఒక సినిమా స్క్రిప్టును ఎలా రాస్తారో తెలిసిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం చూస్తున్నాను.

మామూలుగా కథలు రాయడం వేరు. సినిమా కోసం స్క్రిప్ట్ రాయడం వేరు.

ఈ ముఖ్యమైన తేడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం.

అంతే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా స్క్రిప్టుని (యాక్షన్ పార్ట్. డైలాగ్ పార్టులతో) ఏ ఫార్మాట్‌లో ఎలా రాస్తారో ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

ఒకవేళ అంతర్జాతీయస్థాయిలో అందరూ ఫాలో అయ్యే "ఫైనల్ డ్రాఫ్ట్" తరహా సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి స్క్రిప్టుని రాయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది.

ఈ అవకాశం కేవలం కొత్త/యువ స్క్రిప్ట్ రచయితలకు మాత్రమే అన్న విషయం దయచేసి గమనించాలి. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినవారికోసం కాదు.

బాగా రాయగల సామర్థ్యం ఉండీ, అవకాశాలు రానివారికి ఇదొక మంచి అవకాశం. కనీసం ఒక నలుగురు రైటర్స్‌ను తీసుకొనే అవకాశం ఉంది.

మీదగ్గరున్న స్టోరీలైన్‌లు నాకు నచ్చితే వాటిని తీసుకుంటాను. లేదంటే - నేనిచ్చిన స్టోరీలైన్ మీద మీరు వర్క్ చేసి మీ వెర్షన్ రాయాల్సి ఉంటుంది.

ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సబ్జక్టులకే ప్రాధాన్యం.

సెలక్ట్ అయి, నాతో పనిచేసినవారికి తప్పక టైటిల్ కార్డు తప్పక ఇస్తాను. తగిన పారితోషికం ఉంటుంది.

పైన చెప్పిన విధంగా నిజంగా స్క్రిప్ట్ రాయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉన్న కొత్త/యువ స్క్రిప్ట్ రైటర్స్‌కి (Male/Female) మాత్రమే ఈ అవకాశం అని మరోసారి మనవి.

Aspiring NEW Script Writers can send in their details and mobile number to my email immediately: 2019newtalent@gmail.com

Monday 18 February 2019

సర్వమ్ ఆధ్యాత్మికమ్!

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. ఈ రెండూ నాకత్యంత ఇష్టమైన అంశాలు.

ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా? ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా? భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది.

ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.

నిజానికి ఈరెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.

అంతే తప్ప, అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు .. కాకూడదు. 

కొత్త సింగర్స్‌కు ఛాన్స్ ఎందుకు?

ఇండస్ట్రీకి నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు నా గతచిత్రం 'స్విమ్మింగ్‌పూల్' మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేనొక విషయం చెబుతూ వస్తున్నాను ...

"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. నాకలాంటి భ్రమలు లేవు.

అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ సీడీలో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అనుకోకు.

ఏ క్యాబ్ వాడో తప్ప, ఇప్పుడు ఆడియో సీడీలు ఫ్రీగా ఇచ్చినా ఎవ్వడు తీసుకోడంలేదు. ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు ఆడియో రిలీజ్ కంటే ముందే ఆ సాంగ్స్ ఇంటర్‌నెట్‌లో లీకయిపోతున్నాయి.

సో, మన పాటలు కూడా బాగుంటే వద్దన్నా పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. వినాలనుకున్నవాడు డౌన్‌లోడ్ పెట్టుకుంటాడు."

కాబట్టి -

"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని ప్రదీప్‌చంద్రకు చెప్పాను.

అలాగని నేను పాత సింగర్స్‌కు వ్యతిరేకం ఏం కాదు.

నా తొలిచిత్రం 'కల' కోసం చిత్ర, యస్ పి బాలు నుంచి కార్తీక్, టిప్పు, పాప్ శాలిని మొదలైన ఎందరో టాప్ సింగర్స్‌తో పాడించాను. ఆ నాస్తాల్జియా గురించి మరోసారి రాస్తాను. 

కట్ బ్యాక్ టూ మన న్యూ సింగర్స్ -  

కొత్త సింగర్స్‌ను పరిచయం చేద్దాం అని నేను ప్రదీప్‌చంద్రతో చెప్పడానికి చాలా కారణాలున్నాయి ..

వెనకటి రోజుల్లో గాయనీగాయకుల్లాగా ఏ ఒకరిద్దరో మాత్రమే పాడుతూ .. 'దశాబ్దాలకొద్దీ గాన సామ్రాజ్యాల్ని ఏలాలి' అనుకొనే రోజులు కావివి.

అప్పుడంటే అలా నడిచింది. ఇప్పుడలా నడవదు గాక నడవదు.

ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. విని ఆనందిస్తున్నారు.

సినిమాలతో, భాషతో సంబంధం లేకుండా, ఒకే ఒక్క 'ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో'తో ఓవర్‌నైట్‌లో టాప్ సింగర్స్ అయిపోతున్న రోజులివి. 

ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం.

అలాగే - ఇప్పటికే పరిచయమైనా, రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న 'అప్‌కమింగ్ సింగర్స్‌'ను కూడా వీలయినంత ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన.

మా కొత్త ప్రాజెక్టులకోసం, మార్చిలో 'న్యూ సింగర్స్' ఆడిషన్స్ ఉంటాయి. టాలెంట్ ఉన్న సింగర్స్‌కు తప్పక అవకాశం దొరుకుతుంది.

మా సినిమాలో కేవలం పాటల ద్వారా మాత్రమే కాకుండా, 'ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో'ల ద్వారా కూడా మేము పరిచయం చేసే కొత్త సింగర్స్‌ను పాపులర్ చేస్తాము.

ఇప్పటి టాప్ సింగర్స్ అంతా కూడా ఒకప్పుడు కొత్త సింగర్సే!

సో, గెట్ రెడీ న్యూ సింగర్స్ ...

కొంచెం టచ్‌లో ఉందాం. :)

మార్చిలో కొత్త ఫీచర్ ఫిల్మ్ ఆడిషన్స్

కొత్త హీరోహీరోయిన్‌లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ కోసం ఆడిషన్స్ ఈ మార్చిలో నిర్వహిస్తున్నాము.

ఈ ఆడిషన్స్‌కు సంబంధించిన పూర్తి యాడ్‌ను నా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయటంతోపాటు, కొన్ని వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్ లో కూడా త్వరలోనే ఇస్తున్నాను.

ఆర్టిస్టులు, సింగర్స్ సెలెక్షన్స్ హైద్రాబాద్‌తో పాటు - వైజాగ్‌, ముంబైల్లో కూడా ఉండే అవకాశముంది.

ఇవి కాకుండా, టెక్నీషియన్స్ లో - కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, కొత్త లిరిక్ రైటర్స్‌ మొదలైన వాటికోసం కూడా ఎప్పటికప్పుడు విడివిడిగా యాడ్స్ ఇచ్చి, సెలెక్షన్లకు పిలుస్తాము.

ఆడిషన్స్‌కు అప్లై చేసుకొనే అభ్యర్థుల్లో - సినిమా పట్ల ప్యాషన్, టాలెంట్ .. ఈ రెండే నాకు ముఖ్యం.

వీటి ప్రాతిపదికగానే నాకు అవసరమైన 'లైక్‌మైండెడ్ టీమ్' ఎన్నిక జరుగుతుంది.

త్వరలో ప్రారంభం కానున్న నా రెండు కొత్త సినిమాల కోసం ఈ ఆడిషన్స్.

పూర్తి వివరాలతో మార్చిలో కలుద్దాం. అప్పటిదాకా కొంచెం టచ్‌లో ఉందాం. :)

బెస్ట్ విషెస్ .. 

Sunday 17 February 2019

నెట్‌వర్క్ పెంచుకుందాం రా!

మనిషిని "సోషల్ యానిమల్" అన్నాడో తత్వవేత్త.

సంఘంలోని ఇతర వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కడూ ఉన్నత స్థాయికి ఎదగలేడు. కనీసం బ్రతకలేడు.

ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.

మనం ఎంచుకున్న ఫీల్డులో ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘంలోని ఎంతోమంది సహకారం - లేదా - ప్రమేయం మనకు తప్పనిసరి.

ఈ వ్యక్తులే మన నెట్ వర్క్.

మన నెట్‌వర్క్ ని బట్టే మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఉంటాయి. మన నెట్ వర్క్ లో సరయిన వ్యక్తులు లేకుండా ఫలితాలు మాత్రం సరయినవి కావాలంటే కుదరదు.

మనకు పనికి రాని నెగెటివ్ థింకర్స్, మనల్ని వాడుకుని వదిలేసే ముదుర్లు, మన సహాయంతోనే ఎదిగి, మనల్నే వేలెత్తి చూపే మోసగాళ్లు... ఇలాంటి జీవాలు ఏవయినా ఇప్పటికే మన నెట్‌వర్క్ లో ఉంటే మాత్రం వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

ఇలా చెప్పటం చాలా ఈజీ. కానీ, ఈ జీవుల్ని గుర్తించటానికి కొన్ని అనుభవాలు, కొంత టైమ్ తప్పక పడుతుంది. అయినా సరే, తప్పదు.

ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోయినా జీవితాలే అతలాకుతలమైపోతాయంటే అతిశయోక్తికాదు.

అలాంటి అనుభవాలు నేను చాలా తక్కువగా పనిచేసిన ఒక్క సినీ ఫీల్డులోనే ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.

కట్ టూ మన నెట్‌వర్క్ - 

ఏ చిన్న పనిలోనయినా సరే, ఎంత చిన్న లక్ష్యమయినా సరే, ఎంతో పెద్ద గోల్ అయినా సరే - సక్సెస్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరూ - తమకు ఉపయోగపడే నెట్‌వర్క్ ను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి.

ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ విషయం లో కొంతవరకు ఉపయోగపడతాయి.

ఇంకెన్నో ఉన్నా కూడా, ఇప్పుడు మాత్రం ఈ మూడే బాగా పాపులర్ అని నా ఉద్దేశ్యం.

నేను ఇన్స్‌టాగ్రామ్‌లోకి ఈమధ్యే ఎంటరయ్యాను.

వ్యక్తిగతంగా ఫేస్‌బుక్ మీద నాకు సంపూర్ణంగా విరక్తి వచ్చేసింది. గత అక్టోబర్ నుంచి ఆవైపు వెళ్లటంలేదు.

అయితే ఫేస్‌బుక్‌ను ఎవరైనా అంత ఈజీగా వదలడం కష్టం. అదొక పక్కా "ఊర మాస్" సోషల్ మీడియా సాధనం. భారీ రేంజ్‌లో ఎదైనా ప్రమోట్ చేసుకోవాలనుకొంటే ఫేస్‌బుక్ ఉపయోగపడినంతగా మరేదీ ఉపయోగపడదు. 

ట్విట్టర్, అప్పుడప్పుడూ ఇన్స్‌టాగ్రామ్ ... ఇప్పుడీ రెండే నా సోషల్ మీడియా లోకం.

ఈలోకంలో నేను విహరించేది ఏవో కొన్ని నిమిషాలే.

నెట్‌వర్కింగ్ ఒక్కటే అని కాదు. ఈ కొద్దినిమిషాల సోషల్ మీడియా సంచారం మన రొటీన్ జీవితంలోని రకరకాల ఉరుకులు పరుగుల నుంచి కొంత రిలీఫ్‌నిస్తుంది. ఒక స్ట్రెస్ బస్టర్‌లా కూడా పనిచేస్తుంది.

Please follow me on Twitter! :) 

పేరు + అధికార వ్యామోహం = కల్లోల కాశ్మీర్

కాశ్మీర్ విషయంలో కేవలం దేశంకోసమే .. ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగానో, ఒక ఐరన్ లేడీ ఇందిరా గాంధీలాగానో .. ఓం ప్రథమంగా మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా ఆలోచించి ఉంటే .. భూతల స్వర్గం కాశ్మీర్‌లో పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు.

తాజాగా మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్‌లో 40 మందికిపైగా మన సీఆర్‌పీఎఫ్ జవానులు అమరులయ్యేవారు కాదు.

తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని "పంచశీల" అనే తన పనికిరాని ఐదు సూత్రాలతో, యునైటెడ్ నేషన్స్‌లో గొప్పలకోసం .. అప్పటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఇంకెవడికో పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో .. ఆ రోజునుంచీ కాశ్మీర్ రగులుతూనే ఉంది.

1948 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా .. ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని మనలో చాలామంది ఒప్పుకోకపోవడానికి ఇష్టపడరు.

కానీ, చరిత్ర చెప్తున్న నిజం మాత్రం ఇదే.

కట్ చేస్తే - 

కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో మనం క్రికెట్ ఆడతాం. వ్యాపారం చేస్తాం. ఆ దేశానికివెళ్ళి విందు వినోదాల్లో పాల్గొంటాం. ఆ దేశపు ఆర్మీ ఆఫీసర్స్‌ను ఆలింగనం చేసుకుంటాం. అప్పుడు మాత్రం మనవాళ్లకు కాశ్మీర్ గుర్తుకు రాదు.

ఆ లోయలో ఆహోరాత్రులు దేశంకోసం, మనకోసం కాపలా కాస్తూ .. అదే పాకిస్తాన్ నేపథ్యపు టెర్రరిస్టుల ఆర్డీఎక్స్ ఎటాక్‌ల్లో తమ దేహాల్ని ముక్కలు ముక్కలుగా త్యాగం చేస్తున్న మన వీరజవాన్లు గుర్తుకురారు.

సిగ్గుపడాలి. చావాలి.   

Monday 11 February 2019

తెలంగాణలో బయోపిక్‌లు ఎందుకని రావు?

ఒక్క ఎన్ టి ఆర్ మీదనే ఏకకాలంలో మూడు బయోపిక్‌లు తయారయ్యాయి. వాటిల్లో ఒకటి మొన్నీమధ్యే రిలీజయింది. దాని రెండో భాగం త్వరలో రిలీజ్ కాబోతోంది.

క్రిష్ దర్శకత్వంలో ముందు ఒక్క సినిమాకే ప్లాన్ చేసి, తర్వాత దాన్ని రెండు సినిమాలుగా రూపొందించారు. అది వేరే విషయం.

మరోవైపు, దర్శకుడు ఆర్జీవీ "లక్ష్మీస్ NTR" అనే టైటిల్‌తో, అదే ఎన్ టి ఆర్ మీద ఇంకో భారీ బయోపిక్ తీస్తున్నాడు.

దీని ట్యాగ్‌లైన్: 'అసలు కథ' .. టాప్‌లైన్: 'ఇది కుటుంబ కుట్రల చిత్రం!'

ఎన్ టి ఆర్, లక్ష్మీపార్వతిల ప్రేమను సింబాలిక్‌గా తీసుకొని అనుకుంటా .. ప్రేమికులరోజు ఫిబ్రవరి 14 నాడు, ఉదయం 9.27 నిమిషాలకు ఆర్జీవీ తను తీస్తున్న "లక్ష్మీస్ NTR" బయోపిక్ ట్రయలర్ రిలీజ్ చేయబోతున్నాడని ఇందాకే ఒక ట్వీట్ చదివాను.

ఇది సెన్సార్ దగ్గర ఏమవుతుందో ఆ పైనున్న ఎన్ టీ ఆర్ కే తెలియాలి. అసలా చాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా తన మియా మల్కోవా సినిమాలా దీన్ని కూడా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేస్తాడా వర్మ అన్నది ఆ సినిమా బడ్జెట్ అంత ప్రశ్న!

మొన్న 8వ తేదీనాడు వైయస్సార్ బయోపిక్ 'యాత్ర' రిలీజైంది. బాగా నడుస్తోంది.

ఒక బయోపిక్ సినిమాగా 'యాత్ర' ను బాగా తీసి, విజయవంతం చేసిన డైరెక్టర్ మహి వి రాఘవ్‌కు  శుభాకాంక్షలు. వైయస్సార్ పాత్రకు మమ్ముట్టిని ఎన్నుకోవడంలోనే మహి తొలి విజయం సాధించాడు.

క్రిష్ తీసిన ఎన్ టి ఆర్ బయోపిక్ మొదటి భాగం బాగుందో లేదో తెలీయదు కాని, బాగా నడవలేదు. భారీ నష్టాలపాలయ్యింది.

ఇంక హిందీలో అయితే లెక్కలేనన్ని బయోపిక్‌లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

త్వరలోనే మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మీద కూడా ఒక బయోపిక్ రాబోతోందని లేటెస్ట్ న్యూస్.

కట్ చేస్తే - 

తెలంగాణలో ఈ మధ్య మన కేసీఆర్ మీద ఒకట్రెండు బయోపిక్‌లు తీసినట్టుగా చదివాను. అవి రిలీజయ్యాయో లేదో కూడా నాకు తెలియదు. వాటి నిర్మాణ విలువలు పైన చెప్పుకొన్న బయోపిక్‌ల స్థాయికి కనీసం దరిదాపుల్లో కూడా ఉండే అవకాశం లేదు.

దీనికి కారణం ఇక్కడ ఆ టాలెంట్ లేక కాదు.

డబ్బు పెట్టే నిర్మాతలు ఇక్కడ లేక!

ఎవరో ఒకరిద్దరున్నా, వారు కూడా ఎక్కడ, ఏ సినిమాలకు, ఏ హీరోలకు డబ్బు పెట్టాలో అక్కడే పెడతారు.

వారి తప్పేం లేదు.

బిజినెస్!

ప్రస్తుతం తెలంగాణలో "మల్లేశం" బయోపిక్ ఒకటి రెడీ అవుతోంది. చాలా మంచి ప్రయత్నం అది. ఆ సినిమా పూర్తయ్యాక, దాని రిలీజ్ నుంచి పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకొనేవరకూ ఆ టీమ్‌కు ఎలాంటి అడ్డంకులు, కష్టాలు రావొద్దని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. 

ఇక్కడి దర్శకుల టాలెంట్ గురించి మనవాళ్లే వాగే వాగుడుకి .. ఈ మధ్య ఎడాపెడా ట్రెండీ సూపర్ డూపర్ హిట్స్‌తో బాగా నిరూపించారు మన తెలంగాణ దర్శకులు. ఇంక దాని గురించి మాట్లాడే అవసరం లేకుండా.

ఆ దర్శకులు కూడా ఆ స్థాయి విజయాలను సాధించడానికి ఎన్ని రిస్కులు తీసుకొని, ఎన్ని కష్టాలు పడ్దారో వారి ఇంటర్వ్యూలే చెప్తాయి.

మామూలు కమర్షియల్ సినిమాలకే అట్లా ఉంటే .. ఇంక బయోపిక్‌లకు ఎవరు పెడతారు మన దగ్గర?

అల్లాని శ్రీధర్ "కొమరం భీమ్" తీయడానికి పడ్ద కష్టాలు ఎవరికి తెలుసు?

ఒక్క ముక్కలో చెప్పాలంటే, తెలంగాణలో దర్శకుల టాలెంట్‌లో 90 శాతం టాలెంట్, వారి విలువైన సమయం .. బడ్జెట్ ఎట్లా అన్న ఆలోచన, ఆ బడ్జెట్‌ను నానా రకాలుగా సమకూర్చుకొనే ప్రయత్నాలతోనే వృధా అవుతుంది.

తెలంగాణ దర్శకుల కష్టాలు ఒక బి నర్సింగరావుకు తెలుసు, ఒక అల్లాని శ్రీధర్‌కు తెలుసు, ఒక రమేష్ రెడ్డి తుమ్మలకు తెలుసు, ఇంకా .. ఇలాంటి చాలా మందికి తెలుసు. వారిలో ఎక్కడో ఒక మూలన మనోహర్ చిమ్మని కూడా ఉంటాడు.

సినిమా అంటే కోట్లు కుమ్మరిస్తారు. కోట్లు సంపాదిస్తారు.

ఆ దమ్ము ఇక్కడ లేదు.

ఇంక బయోపిక్‌ల కోసం వాళ్లలా ఒక్కో సినిమాకు 50, 60 కోట్లు మనవాళ్లెప్పుడు పెట్టాలి? 

Wednesday 6 February 2019

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ అభ్యర్థులు!

62 ప్యూన్ ఉద్యోగాలు పడ్డాయి.

అదీ పోలీస్ డిపార్ట్‌మెంట్లో.

ఈ 62 మెసెంజర్-కమ్-ప్యూన్ ఉద్యోగాలకు రికార్డ్ స్థాయిలో 93,000 మంది నిరుద్యోగులు అప్లైచేసుకున్నారు.

ఎంతమంది అప్లై చేసుకున్నా తప్ప్పులేదు.

కానీ, ఈ 93,000 మందిలో -
3,700 మంది పీహెచ్‌డీ చేసినవాళ్లున్నారు.
28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లున్నారు.
50,000 మంది గ్రాడ్యుయేట్లున్నారు.

ఈ ప్యూన్ ఉద్యోగానికి కావల్సిన రెండే రెండు ప్రాథమిక అర్హతలు ఇవి:
1. సైకిల్ తొక్కడం రావాలి.
3. 5వ తరగతి చదువుకొని వుంటే చాలు.

ఎక్కువమంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడా ప్యూన్ ఉద్యోగాల సెలెక్షన్స్‌కు నానా రకాల టెస్టులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు.

కట్ చేస్తే - 

ప్యూన్ ఉద్యోగం అంటే 'చేయకూడని ఉద్యోగం' ఏమీ కాదు.

ఏ పని విలువ దానిదే.

కాకపోతే, '5 వ తరగతి చదివితే చాలు' అనే స్థాయి ఉద్యోగాలు చేయడం కోసం పీహెచ్‌డీలు, పీజీలు, డిగ్రీలు చేయాల్సినపనిలేదు.

గవర్నమెంటుకు నష్టం. మనకూ నష్టమే.

డబ్బూ, సమయం కూడా ఎంతో వృధా.

నిజానికి .. తిట్టాల్సింది 71 ఏళ్లుగా మన దేశాన్ని పాలించిన ప్రభుత్వాలను, ఆయా ప్రభుత్వాల్లో పనిచేసిన విద్యామంత్రిత్వ శాఖలను. మొత్తంగా మనవాళ్ళు అస్సలు పట్టించుకోని మన విద్యా వ్యవస్థని.

అభివృధ్ధి చెందిన దేశాల్లో .. స్కూలు స్థాయినుంచే చదువుకొంటూ పనిచేసుకొని డబ్బులు సంపాదించుకొనేట్టుగా అలవాటుచేసే ఒక డిసిప్లిన్ అక్కడి విద్యావ్యవస్థల్లో ఉంది.

'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ఆయా దేశాల్లో ఉంది.

ఎవరు ఏ క్షణమైనా చదువు మానేసి, తమకు ఇష్టమైన పని చేసుకొని బ్రతకగలిగే ఆత్మవిశ్వాసాన్ని అక్కడి విద్యావ్యవస్థలు అందిస్తున్నాయి.

బిల్ గేట్స్‌లూ, జకెర్‌బర్గ్‌లూ అలాగే తయారయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగాలకోసం ముసలోళ్లు అయ్యేదాకా ఎదురుచూస్తూ వారి సమయం వృధాచేసుకోలేరు.

మరిక్కడ .. మనదగ్గరో?

సిగ్గుపడాలి ...

71 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఒక దేశం ఇంకా "అభివృధ్ధిచెందుతున్న దేశం" గానే ఉంది.

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ చేసినవాళ్లు కూడా అప్లై చేసుకొంటున్నారు ... 

ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే కాదన్న కామన్‌సెన్స్ ఇవ్వలేని మన విద్యావ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతోంది.

కట్ చేస్తే - 

ఈ 62 ప్యూన్ ఉద్యోగాలు పడింది ఎక్కడో చెప్పలేదు కదూ?

ఉత్తరప్రదేశ్‌లో.